
యూకే :
యునైటెడ్ కింగ్డమ్లో భారతీయులకు ప్రస్తుతం మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యూకే వ్యాప్తంగా అక్రమ వలసదారులపై యూకే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.తమ దేశంలోకి అక్రమంగా ఉంటూ పనులు చేసుకుంటున్న కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ సెలూన్లు, షాపులు, కార్ వాషెస్ సెంటర్లు సహా అనేక ప్రాంతాలను పరిశీలించారు.ఈ ప్రదేశాలలో పనిచేస్తున్న కార్మికులకు.. యూకేలో పనిచేయడానికి చట్టపరమైన అనుమతి ఉందా? అన్న విషయంపై వారు తనిఖీలు చేస్తున్నారు. భారతీయ రెస్టారెంట్లలో సోదాలు జరిపి అరెస్టులు చేస్తున్నారు.ఇప్పటికే అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే బాటలో వెళ్తుండడంతో అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.బ్రిటన్ వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. వలసదారులు పని చేసే ఇండియన్ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని అధికారులు సోదాలు చేయడం గమనార్హం. యూకే హోంమంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ దీనిపై స్పందిస్తూ.. తమ దేశ చట్టాలను ఉల్లంఘిస్తూ.. అక్రమ వలసదారులకు పరిశ్రమల్లో పనులు ఇచ్చే చర్యలను అడ్డుకుంటామని అన్నారు.తాజాగా హంబర్సైడ్ ఏరియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. అంతేగాక, మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అక్రమ వలసదారులపై అమెరికాలో చర్యలు తీసుకున్నట్లే యూకేలోనూ వారిని బంధించి వెనక్కి పంపించేస్తున్నారు.అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు వేస్తూ, కాళ్లకు గొలుసులు బిగిస్తున్నారు. ఇందుకు ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం దీనిపై స్పందిస్తూ తమ దేశంలో అక్రమ వలసలు పెరిగాయని అన్నారు. అక్రమంగా తమ దేశంలో ఉపాధి పొందుతున్నారని, ఇటువంటి వలసలు లేకుండా చేస్తామని చెప్పారు.