కోహ్లీ కీలక ఇన్నింగ్స్..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు టీమిండియా..
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది. అక్షర్ పటేల్ (27), రోహిత్ శర్మ (28) కూడా చెప్పుకోదగిన స్కోర్లు సాధించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆదివారం దుబాయ్లో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో తలపడబోతోంది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. భారత్ ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (39), మిడిలార్డర్లో లంబుషేన్ (29) కూడా రాణించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.
265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తడబడింది. రోహిత్ ఇచ్చిన రెండు క్యాచ్లను ఆసీస్ ఫీల్డర్లు వదిలేశారు. గిల్ (8) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. శ్రేయస్ తర్వాత వచ్చిన అక్షర్, కేఎల్ రాహుల్ కూడా కోహ్లీతో భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, బుధవారం లాహోర్లో జరబోయే సెమీస్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. ఆ మ్యాచ్లో గెలిచే జట్టు ఆదివారం టీమిండియాతో ఫైనల్లో తలపడనుంది..