
( న్యూస్ వన్ బ్యూరో )
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. మొత్తంగా రూ.3 లక్షల 22 వేల 359 కోట్లతో పద్దును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశ పెట్టారు. తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటింది. ఇందులో రూ.48,340 కోట్లును వ్యవసాయానికి కేటాయించారు. మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లుగా తేల్చారు. అయితే అటు రెవిన్యూ.. ఇటు ద్రవ్యలోటు భారీగా ఉండనుంది. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగాకేశవ్ ప్రకటించారు.అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులందరికీ .. స్కూళ్లు తెరిచే నాటికి జమ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కూడా ఈ? బడ్జెట్లో ప్రతిపాదించారు. దాదాపుగా ప్రతి రంగానికి మెరుగైన కేటాయింపులు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఈ ఏడాది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు.అదే సమయంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించారు. అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు కేటాయించారు. మిగతా నిధులు కేంద్రం గ్రాంటుగా.. రుణాలుగా ఇస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియలు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ ముగియగానే.. మార్చి పదిహేనో తేదీ నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.కేటాయింపుల వరకూ అద్భుతంగా ఉన్నా.. ఈ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్.. చూపించిన మేరకు సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచుకోవడం. ఇప్పటికే మెరుగైన వృద్ధి రేటు సాధించామని రాబోయే రోజుల్లో అది ఆదాయం రూపంలో ప్రతిఫలిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. సంపదను సృష్టించి ప్రకటించిన బడ్జెట్ మేరకు కేటాయింపులు చేసి.. ఖర్చు పెడితే ప్రభుత్వం అద్భుత పనితీరు కనబర్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని.. అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు.. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్దఎత్తున చేపడతామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబయి, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో.. మనకూ అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబయి, హైదరాబాద్ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు.
బడ్జెట్లో కేటాయింపులు ఇలా :
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
ఆర్అండ్బీకి రూ.8,785 కోట్లు
యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు (2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు)
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు