
డీప్సీక్ దెబ్బకు…రూ.7.9 లక్షల కోట్లు ఆవిరి
చైనా : ఇటీవల కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించిన చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అమెరికా కంపెనీలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు టెక్ దిగ్గజాల సంపద భారీగా కరిగిపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నెల రోజుల్లోనే దాదాపు 90 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.7.9 లక్షల కోట్లు) సంపదను కోల్పోయారు. ఎన్విడియా, మెటా అధినేతల ఆస్తులు కూడా భారీగానే తగ్గాయి.ఈ ఏడాది జనవరిలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపద 314 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది కోటిన్నర మంది ఉద్యోగుల సగటు వార్షిక వేతనాలకు సమానం. అయితే, ఇందులో చాలామంది బిలియనీర్ల లాభాలు ఎన్నో రోజులు నిలువలేకపోయాయి. ఫిబ్రవరి ఆరంభంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నికర సంపద 433 బిలియన్ డాలర్లు ఉండగా.. నెలాఖరు నాటికి 349 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే దాదాపు 90 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారు.ఎన్విడియా సీఈఓ జేసెన్ హువాంగ్ సంపద 20 బిలియన్ డాలర్లు, మెటా సీఈఓ జుకర్బర్గ్ నికర ఆస్తులు దాదాపు 11 బిలియన్ డాలర్ల మేర తరిగిపోయాయి. ఒరాకిల్ ఛైర్మన్ ల్యారీ ఎలిసన్ 27.6 బిలియన్ డాలర్లు కోల్పోయి ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ నికర సంపద 6.3 బిలియన్ డాలర్ల మేర తగ్గింది.చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్సీక్. దీన్ని 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ ప్రారంభించారు. ఇటీవల ఈ కంపెనీ ఆర్1 పేరిట ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. ఓపెన్ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలుచేస్తుండగా.. పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్ను ఇలా ఉచితంగా అందిస్తుండడం యూజర్లను ఆకట్టుకుంది. దీంతో ఇటీవల డీప్సీక్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.అంతేకాదు.. అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసింది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్తోనే తాము ఏఐ మోడల్స్ను రూపొందించామని కంపెనీ పేర్కొనడం ఇందుక్కారణం. దీంతో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, టెస్లా వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎన్విడియా తన మార్కెట్ విలువలో ఏకంగా 600 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. యూఎస్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఓ కంపెనీ అతితక్కువ వ్యవధిలో ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.