పీటీ వారెంట్లతో రాజంపేట జైలు వద్దకు వచ్చిన నరసరావుపేట పోలీసులు
రాజాం పేట,న్యూస్ వన్ ప్రతినిధి :
వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానికి తీసుకెళ్లేందుకు వారు వాహనాలు సైతం సిద్ధం చేసుకున్నారు.ఒకేసారి మూడు పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో పోసాని కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట టూ టౌన్ పీఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.మరోవైపు తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని ఇవాళ ఉదయం పోసాని జైలు అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి పోసానిని పరీక్షిస్తున్నట్లు సమాచారం. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన పోసాని.. ప్రస్తుతం రాజంపేట సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.