
హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి :
మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు అధికారులు. గతంలో ఆర్బీఎక్స్ అని రాసి ఉన్న ఇళ్లను అసంపూర్తిగా కూల్చేయడంతో జనం మళ్లీ ఆ ప్రాంతంలోకి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.దీంతో జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ఇవాళ మరోసారి మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్ ఘాట్, శంకర్ నగర్ బస్తీలో ఇళ్లను కూల్చివేశారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ పరిసరాల్లో సుమారుగా 290 ఇళ్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.మూసీ ప్రక్షాళనలో భాగంగా గతంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితుల నిర్మాణాలకు సంబంధించి మరోసారి కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. సుమారుగా 4 నెలల క్రితం మూసీ ప్రక్షాళనలో భాగంగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ఇళ్లను గుర్తించారు. ఆ ఇళ్లలో ఉంటున్న వారిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించారు.అయితే, కొంతమంది తిరిగి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చేశారు. తిరిగి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గతంలో మార్కింగ్ వేసిన ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఈరోజు నుంచి సుమారుగా రెండు మూడు రోజుల పాటు కూల్చివేతలు ఉంటాయని తెలుస్తోంది.మూసీ పరివాహక ప్రాంతంలో 292 ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించారు. అయితే, కొంతమంది తిరిగి వచ్చి మళ్లీ అవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో అధికారులు ఈసారి ఖాళీ చేసిన ఇళ్లను పక్కాగా నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన నిర్మాణాలను అధికారులు జేసీబీల సాయంతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు.