న్యూఢిల్లీ :
సినీ నటుడు, దర్శక, నిర్మాత.. డైలాగ్ కింగ్ మోహన్బాబు కు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. జర్నలిస్టు పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో ఫిటీషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును జస్టిస్ సుదాంశ్ దులియా ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా మోహన్బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జర్నలిస్ట్పై జరిగిన దాడికి తాను బహిరంగంగా క్షమాపణ చెప్పానని.. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మోహన్ బాబు ధర్మాసనానికి చెప్పారు.
జర్నలిస్టుపై మోహన్బాబు దాడి :
కాగా జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోహన్బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్పల్లిలో ఉన్న మోహన్బాబు ఇంటికి వార్తల కవరేజీ కోసం వెళ్లిన తనపై మోహన్బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్టు రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కొట్టివేసింది.గత ఏడాది డిసెంబరు 10న మోహన్ బాబు తనయుడు మంచుమనోజ్ విజ్ఞప్తి మేరకు ఆయన వెంట మీడియా మోహన్బాబు ఇంటికి రాగా ఆయన ఒక విలేకరి దగ్గరున్న మైక్ను లాక్కొని తల మీద కొట్టారు. తీవ్ర గాయాల పాలైన విలేకరిని ఆస్పత్రిలో చేర్చారు. రాచకొండ పోలీసులు మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుకుసంబంధించి కోర్టులో వాదనల సందర్భంగా జర్నలిస్టు రంజిత్ తరఫు న్యాయవాది వాదిస్తూ, మోహన్బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా గొంతు పట్టి నులిమారని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మోహన్బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు కావడంతో డివిజన్ బెంచ్కు అప్పీలు చేసే అవకాశం లేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం మోహన్బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.