విశాఖపట్నం
విశాఖ నగరంలో అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జీవీఎంసీ యూసీడీ విభాగం సకాలంలో అందించాలని, మహిళల ఆర్థిక పురోగతికి సహకరిస్తూ చిత్తశుద్ధితో అధికారులు విధులను నిర్వహించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ ఎస్ వర్మ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యు సి డి) సత్యవేణి, ఇతర యు సి డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్హులైన ప్రజలకు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వాటిని సక్రమంగా అర్హులైన ప్రజలకు అందించి ప్రభుత్వానికి జీవీఎంసీకి మంచి పేరుతో పాటు మంచి పాలన అందించేందుకు యు సి డి అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి సహకరించాలన్నారు. నగరంలో ఏ ఏ కేటగిరీలో ఎన్ని ప్రభుత్వ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. నైట్ షెల్టర్లను రాత్రి 11 గంటల తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఉన్న 25 అన్నా క్యాంటీన్లను అధికారులు సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించాలని, నైట్ షెల్టర్ల తో పాటు అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా తాను తనిఖీలు నిర్వహిస్తానని అధికారులకు మేయర్ తెలిపారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసి భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానన్నారు . నగరంలో నిర్మించిన టిడ్కో గృహాలలో అనర్హులు ఉన్నారని చాలాచోట్ల టిడ్కో గృహాలు ఖాళీగా ఉన్నాయని మొత్తం టిడ్కో గృహాల జాబితా వాటి వివరాలు అందించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ (యూసిడి)ని ఆదేశించారు. కొంతమంది ఆర్పీలపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రజలకు మంచి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని యు సి డి అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు డి. లక్ష్మీ, సూర్య కళ, డిపిఓలు హనుమంతు శంకర్, సురేష్, డిప్యూటీ తహసిల్దారు నాగలక్ష్మి , ఏపిడీలు ఇతర యు సి డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు