హద్దులు దాటుతున్నారు
News Image

న్యూ ఢిల్లీ  :తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్‌పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. కేంద్ర సంస్థకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం.. రాష్ట్రంలో ఈడీ చర్యలు అసమానమైనవిని.. అంతేకాకుండా రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.తమిళనాడులో రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. మద్యం సరఫరా ఆర్డర్‌లను పొందడానికి డిస్టిలరీలు లెక్కల్లో చూపని నగదు ఇచ్చాయని పేర్కొంది. దీంతో తమిళనాడులో ఈడీ దాడులు చేస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ కొట్టేస్తూ ఈడీ దాడులకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సరైన ఆధారాలు లేకుండా ఈడీ దర్యాప్తు చేస్తోందని.. టాస్మాక్ సిబ్బందిని.. మహిళలను వేధిస్తున్నారని… గోప్యత.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. గురువారం పిటిషన్ విచారించిన ధర్మాసనం.. తక్షణమే దాడులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈడీ దాడులపై మండిపడింది. ఈడీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే ప్రభుత్వం హర్హం వ్యక్తం చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈడీ దాడులకు కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించింది.