విశాఖపట్నం మే 20; మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా కార్పోరేటర్ దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారని విశాఖ జాయింట్ కలెక్టర్, అదనపు మెజిస్ట్రేట్, ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మాట్లాడుతూ మే 19వ తేదీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జివిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో సభ్యులు సమావేశం అయినప్పటికీ క్వారమ్ లేకపోవడం వలన డిప్యూటీ మేయర్ ఎన్నిక మే 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు వాయిదా వేసామని తెలిపారు. 20వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశ మందిరం లో ప్రత్యేక సమావేశం నిర్వహించి డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా బి-ఫారమ్ టికెట్ 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు సమర్పించారని, దల్లి గోవిందరాజు ను డిప్యూటీ మేయరు అభ్యర్ధిగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు) ప్రతిపాదించగా, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు బలపరిచారని, ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు మొత్తం 59 మంది హాజరు కాగా డిప్యూటీ మేయర్ ఎన్నికకు సరిపోయిన క్వారమ్ ఉన్నందున మరో అభ్యర్థి పోటీలో లేనందున డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరాజు ఎన్నికైనట్లు ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు.
అనంతరం డిప్యూటీ మేయరు గా దల్లి గోవిందరాజు చే ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి ప్రమాణా స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా కూటమి శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామక్రిష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, పి.గణబాబు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, కార్పొరేటర్లు, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, అధికారులు, సిబ్బంది నూతన డిప్యూటీ మేయర్ కు పుష్ప గుచ్చాలు అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.