అంతా ఫ్యామిలీ డ్రామా: బండి సంజయ్‌
News Image

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత  వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్‌ క్రియేషన్‌ జరుగుతోందని ఎద్దేవా చేశారు. ‘‘భారాసలో చార్‌పత్తా ఆట నడుస్తోంది. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్‌ చేస్తున్నది కాంగ్రెస్‌. భాజపా-భారాస ఎప్పుడూ కలవవు. కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు మా పార్టీతో కలిసేందుకు ప్రయత్నించారు. అవినీతి భారాసతో భాజపా కలవదు. కాంగ్రెస్‌-భారాస మాత్రమే కలిసి పనిచేశాయి.వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరం. ఈ ఘటనపై ఈవోతో మాట్లాడతాను. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలి. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారు. మన సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి  వ్యాఖ్యలు ఉన్నాయి. పాక్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు యుద్ధం కొనసాగుతుంది ’’ అని బండి సంజయ్‌ అన్నారు