రాజౌరి దాడుల్లో ప్రభుత్వ అధికారి సహా ఐదుగురి మృతి
News Image


 జమ్మూకశ్మీర్ : భారత్ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్థాన్‌ దుర్మార్గంగా దాడులకు తెగబడుతోంది. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్‌ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్‌ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజౌరిలోనే మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్‌కుమార్‌ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజ్‌కుమార్‌ మృతిపై ఒమర్‌ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్‌ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. రాజౌరిని లక్ష్యంగా చేసుకున్న పాక్‌ జరిపిన దాడుల్లో రాజ్‌కుమార్ మృతి చెందారు. దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’’ అని పోస్టు చేశారు. 

శ్రీనగర్, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు :

శనివారం వేకువజామున కూడా భారత్‌పై పాకిస్థాన్‌ సైన్యం దాడులకు ఉపక్రమించింది. రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల బాంబుపేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్‌’ పాటించారు. శ్రీనగర్, పఠాన్‌ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్‌ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. ఇటు పఠాన్‌కోట్‌ లోనూ ఉదయం 5 గంటల సమయంలో పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు సమాచారం. అయితే, అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఫిరోజ్‌పుర్‌లో ముగ్గురు గాయపడ్డారు.