( న్యూస్ వన్ బ్యూరో )
ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంటోంది. కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా కేంద్రంలో మూడో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీకి అండగా నిలుస్తోంది. ఆర్దిక సాయంతో పాటుగా ప్రాజెక్టులను ఆమోదిస్తోంది. ఇక, ఇప్పుడు తాజాగా విశాఖ కేంద్రంగా కీలక ఉత్తర్వులు జారి చేసింది. విశాఖ వాసుల చిరకాల కోరిక నెరవేరనుంది. ఇందుకు సంబంధించి బాధ్యతలు ఖరారు చేసారు.విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జోన్కు తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇక విభాగాల అధిపతు లను నియమించడం సహా జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాల్సి ఉంది. జోన్ కార్యకలాపాల ఆరంభ తేదీ ప్రకటనే కీలకంగా మారింది.రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు జనరల్ మేనేజర్ పోస్టును భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు ఈ కొత్త జోన్కు ప్రత్యేక అధికారి మాత్రమే ఉండగా సందీప్ మాథుర్ని దక్షిణ కోస్తా జోన్ మేనేజర్గా నియమిస్తూ రైల్వేబోర్డు సంయుక్త కార్యదర్శి విక్రమ్సింగ్ దహియా ఉత్తర్వు జారీచేశారు. దీంతో జోన్కు కీలక సారథి వచ్చినట్లయింది. జోన్కు ఇప్పటివరకు జనరల్ మేనేజర్ పోస్టు లేదు. మరోవైపు వడోదరాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ అనే జీఎం కేడర్ కలిగిన పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ పోస్టును విశాఖ జోన్కు బదలాయించి, ఇక్కడ జీఎంను నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. విశాఖ రైల్వేజోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. వాల్తేరు డివిజన్ స్థానంలో విశాఖ పట్నం డివిజన్ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. రూ. 149 కోట్లతో 9 అంతస్తులతో పాటు గ్రౌండ్ఫ్లోర్, పార్కింగ్ కోసం మరో రెండు అంతస్తులతో కూడిన జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి, బీసీ భుయాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారు.విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జోన్కు ఇంకా ఒక సహాయ జీఎం, పది విభాగాలకు ముఖ్య విభాగాధిపతులైన ప్రిన్సిపల్ హెచ్వోడీలు, వారి కింద విభాగాధిపతులు, హెచ్వోడీలు, ఇతర అధికారులు కలిపి దాదాపు 170 మందిని నియమించాలి. దక్షిణమధ్య రైల్వేజోన్ నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పుకోస్తా రైల్వేజోన్లో ఉన్న వాల్తేరు డివిజన్ ఇకపై కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ నాలుగు డివిజన్లకు చెందిన కొందరు ఉన్నతస్థాయి అధికారులను కొత్త జోన్ కేంద్రమైన విశాఖకు తీసుకురావాల్సివ అవసరం ఉంది. నాలుగు డివిజన్లతో కూడిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ ప్రచురించడంతో పాటు, అది ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది అందులో ప్రకటించడం కీలకమైనది. ఆ తేదీ నుంచి జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి