పెరుగుతున్న జేఎన్.1 కరోనా వేరియంట్ కేసులు
News Image

ముంబయి :  భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు మళ్లీ పాతరోజులు పునరావృతం అవుతాయా అని భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్‌తో సహా ఆసియా అంతటా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టిసారించారు. అయితే, హాంకాంగ్, సింగపూర్ లలో కొవిడ్ విజృంభణకు ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8 అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు తేల్చారు. ఈ రెండు వేరియంట్లు కూడా జేఎన్.1 అనే మరో కొత్త వేరియంట్ నుంచి ఉద్భవించనవే కావడం గమనార్హం.


జేఎన్.1 వేరియంట్ అంటే..?


సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ లలో కనుగొనబడిన చాలా కేసులు ఓమిక్రాన్ వేరియంట్ జేఎన్.1, దాని ఉప వేరియంట్ల నుంచి వ్యాప్తి చెందినవిగా గుర్తించారు. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ ప్రత్యేకమైనదిగా గుర్తించబడింది. జేఎన్.1 వేరియంట్ అనేక మార్పులతో రోగనిరోధక శక్తిని తప్పించుకుని ఇన్‌ఫెక్షన్ కలుగజేస్తోంది.


జేఎన్.1 తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే.?


జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం.. జేఎన్.1 ఒకటి లేదా రెండు అదనపు ఉత్పరివర్తనాల ద్వారా వేగంగా వ్యాప్తిచెందుతుంది. ఓమిక్రాన్ వేరియంట్ కు చెందిన బీఏ.2.86కు జేఎన్.1 వేరియంట్ దగ్గరి సంబంధం ఉంది. బీఏ.2.86 వేరియంట్‌తో పోల్చినప్పుడు జేఎన్.1లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఈ మార్పు, వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తి కంచెను దాటుకుని ఇన్ఫెక్ట్ చేయగలుగుతోందని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు.

ఓమిక్రాన్ కు చెందిన ఉపవేరియంట్ అయిన జేఎన్.1 సోకితే తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కారడం లేదా ముక్కు రంద్రాలు మూసుకుపోవటం, తలనొప్పి, రుచి, వాసన కోల్పోవటం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ వైరస్ తేలికపాటి కేసులకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. కానీ, వైరస్ తీవ్రత వ్యక్తి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పై ఆధారపడి ఉంటుంది.ఆసియా దేశాల్లో జేఎన్.1 వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మే ప్రారంభంలో సింగపూర్ లో 14,000కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రోజువారీ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య దాదాపు 30శాతం పెరిగింది. థాయిలాండ్ లో ఏప్రిల్ లో సాంగ్ క్రాన్ పండుగ తరువాత కోవిడ్ కేసులు పెరిగాయి. హాంకాంగ్ లో 81 మందికి వైరస్ సోకగా, అనేక మంది మరణించారు. ఎక్కువగా వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. చైనాలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. గత వేసవి గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ వైరస్ పై ప్రబావిత దేశాల నుంచి ఎటువంటి అధికారిక సలహా లేదా ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి నిషేధాన్ని జారీ చేయలేదు.


తరువాత భారతదేశంలోనేనా..


జేఎన్.1 భారతదేశంలో ఇప్పటికే ఉందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, ఇక్కడ గుర్తించిన కేసుల్లో హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో కేసుల కంటే కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. జేఎన్.1 చాలా సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాకపోవచ్చు. ప్రస్తుతంకు ఈ వైరస్ నియంత్రణలోనే ఉంది. కానీ, అది వ్యాప్తి చెందడం ప్రారంభిస్తే భారతదేశంలో జేఎన్.1 కేసుల ఉధృతికి కారణం కావచ్చు. ప్రస్తుతం జేఎన్.1 వేరియంట్ ఏ స్థాయిలో ఉందో గుర్తించడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి పెరిగితే దీని నిరోధానికి భారతదేశంలో మళ్లీ టీకా అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవటం, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం వంటి ఆరోగ్య చర్యలను అనుసరించాలని వైద్యులు చెబుతున్నారు.