పాక్ వైమానిక స్థావరాలపై భారత్‌ దాడులు
News Image

న్యూ ఢిల్లీ : సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో పాక్‌ దాడి చేయడంతో.. ప్రతిస్పందించిన భారత్‌ ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు.పాక్‌ సైన్యం హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇక భారత్‌పై దాడులకు ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అనే పేరు పెట్టింది. ఈ దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. నేటి ఉదయం 10.30 గంటలకు భారత సైన్యం ప్రెస్‌మీట్‌ నిర్వహించనుంది.రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్నా చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్‌ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్‌ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారు జాము నుంచి పాక్‌ తిరిగి దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.