5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న భారత్
News Image

న్యూ ఢిల్లీ :పాకిస్తాన్ తో యుద్ధం తరువాత భారత రక్షణ శాఖ ఆయుధాల తయారీలో మరింత దృష్టి పెట్టింది. శత్రువులను ఎదుర్కొనేందుకు అత్యంత శక్తివంతమైన ఎయిర్ జెట్లతో పాటు ఆయుధాలను కూడా తయారు చేయడానికి సిద్ధమౌతోంది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్టెల్త్ యుద్ధ విమానాల తయారీపై ముందు అడుగు వేసింది. ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌’ (ఆమ్కా) ప్రాజెక్టు అమలు కోసం ‘ఎగ్జిక్యూషన్‌ నమూనా’కు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు.  దీనిలో భాగంగా స్టెల్త్ లక్షణాలతో మీడియం-వెయిట్, డీప్-పెనెట్రేషన్ ఫైటర్ జెట్‌ను తయారు చేయనుంది. ఇది శత్రువుల రాడార్లను తప్పించుకుని...వారి గగనతలంలోకి దూసుకుని వెళ్ళగలుగుతుంది. బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) దీన్ని తయారు చేస్తోంది.


ఏఐ ఎలక్ట్రానిక్ పైలెట్ తో..

ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 15,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.వైమానిక అభివృద్ధి సంస్థ(ADA) ప్రైవేట్ పరిశ్రమ భాగస్వాముల సహకారంతో AMCA ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుంది. ఈ స్టెల్త్ యుద్ధ విమానం AMCA 2031 నాటికి సిద్ధంగా ఉంటుందని.. 2035 నాటికి ఆకాశంలోకి ఎగురుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త 25 టన్నుల ట్విన్-ఇంజన్ విమానం, AMCA 6.5 టన్నుల సామర్థ్యం గల అంతర్గత ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. దాంతో పాటూ ఈ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఆధారితమైన ఎలక్ట్రానిక్ పైలట్‌తో అమర్చబడి ఉంటుంది. అంతేకాదు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పని చేసి సత్తా చాటగలదు. హైదరాబాద్‌కు చెందిన వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ దీని ఆకృతిని తయారుచేసింది. ఇప్పటి వరకు స్టెల్త్‌ యుద్ధవిమానాల్లో అమెరికాకు చెందిన ఎఫ్‌-22, చైనాకు చెందిన ఎఫ్‌-35, జె-20, జె-35  మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఎస్‌యూ-57 పేరుతో రష్యా కూడా ఈ తరహా ఫైటర్‌జెట్‌ను రూపొందించింది. ఇప్పుడు వీటికి పోటీగా మన దేశం తయారు చేస్తున్న ఆమ్కా నిలవనుంది