త‌ల్లికి వంద‌నంతో జోష్‌!
News Image

( న్యూస్ వన్ బ్యూరో )


ఔన‌న్నా, కాద‌న్నా… సూప‌ర్‌సిక్స్‌లో కీల‌క ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేద‌న్న అసంతృప్తి కేవ‌లం సామాన్య ప్ర‌జానీకంలోనే కాదు, టీడీపీ శ్రేణుల‌ను వెంటాడేది. సూప‌ర్‌సిక్స్‌లో త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాలు కీల‌క‌మైన‌వి. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ఏడాది పూర్త‌యినా , ఇంకా త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌లేద‌న్న అసంతృప్త కామెంట్స్ మొద‌లు కావ‌డం, టీడీపీ శ్రేణుల్ని క‌ల‌వ‌ర‌ప‌రిచింది.


కూట‌మిలో టీడీపీతో పాటు జ‌న‌సేన‌, బీజేపీ ఉన్నాయి. కానీ రాజ‌కీయంగా, ప‌రిపాల‌నా ప‌రంగా అత్య‌ధిక లాభం పొందుతున్న‌ది మాత్రం టీడీపీనే. అందుకే వ్య‌తిరేక‌త కూడా టీడీపీనే ఎక్కువ‌గా ఆందోళ‌న‌కు గురి చేసింది. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు త‌ల్లికి వంద‌నం సంక్షేమ ప‌థ‌కాన్ని అమ‌లుకు శ్రీ‌కారం చుట్టింది. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు చ‌దువుతుంటే, అంద‌రికీ ల‌బ్ధి క‌లిగిస్తామ‌న్న మాట నిల‌బెట్టుకోవ‌డంలో చంద్ర‌బాబు స‌ర్కార్ స‌క్సెస్ అయ్యింద‌నే కామెంట్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.అయితే రూ.15 వేల‌కు బ‌దులు రూ.13 వేలు అందించార‌ని, అలాగే మ‌రికొంద‌రు నిజ‌మైన ల‌బ్ధిదారులను అన‌ర్హులుగా ప్ర‌క‌టించార‌నే విమ‌ర్శ‌లున్న‌ప్ప‌టికీ, భారీ మొత్తంలో ప్ర‌యోజ‌నం పొందిన వాళ్లున్నారు. రూ.13 వేలు ఇచ్చిన‌ప్ప‌టికీ, ఒక్కో ఇంట్లో ఇద్ద‌రికి చొప్పున ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌డంతో అసంతృప్తి అనేది ప‌క్క‌కు పోయింది.


అలాగే ఈ నెల 20 లేదా 21న అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం కింద రైతుల ఖాతాల్లో నిధులు జ‌మ చేస్తామ‌ని ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. బాబు స‌ర్కార్ వాటాగా రూ.5 వేలు, కేంద్ర ప్ర‌భుత్వం రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు అందించ‌నున్నారు. అయితే ప‌థ‌కం అమ‌లు ఏ రీతిలో వుంటుందో చూడాలి. భారీగా కోత‌లు విధించ‌డానికి ర‌క‌ర‌కాల విధివిధానాల్ని ప్ర‌భుత్వం తెర‌పైకి తెస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.ఒక ప‌థ‌కం అమ‌లు చేసేట‌ప్పుడు ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణం. ఈ నెల 23 నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లాల‌ని సీఎం ఆదేశించిన నేప‌థ్యంలో రెండు కీల‌క‌మైన ప‌థ‌కాల్ని అమ‌లు చేశామ‌ని చెప్పుకునే అవ‌కాశం ద‌క్కింద‌ని టీడీపీ శ్రేణులు సంబ‌రంగా చెబుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు, అలాగే సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే అవ‌కాశం లేకుండా చేశామ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక ఇబ్బందులు ఏవైన‌ప్ప‌టికీ, ముఖ్యంగా తల్లికి వంద‌నం అమ‌లు టీడీపీకి భారీ ఊర‌ట అని చెప్పొచ్చు.