న్యూ ఢిల్లీ : యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ పర్యటన గురించి ఆమె డైరీలో ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. పాక్ ఆతిథ్యం బాగుందని ప్రశంసించడంతో పాటు దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిసిపోవాలని జ్యోతి రాశారు.
పాకిస్తాన్కు గూఢచర్యం చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ యూజ్ చేస్తుంటుంది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా వాటిని డైరీలో రాస్తుంటుంది. పాకిస్తాన్ వెళ్లినప్పుడు ఏం జరిగిందనే విషయాలు కూడా రాసి ఉంటుందని పోలీసులు భావించి ఆమె వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్నారు.
10 రోజుల పర్యటన మొత్తం..
డైరీలో తన పర్యటనలు అన్నింటి గురించి కూడా పొందుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇంగ్లీషు, హిందీలో ఆమె తన అనుభవాలను పంచుకుంది. అయితే డైరీని ఆమె ఆచితూచి రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన డైరీని ఇంగ్లీషులో కాకుండా హిందీలో రాసినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ పర్యటన 10 రోజులు పూర్తి అయిన తర్వాత సొంత దేశమైన భారత్కు తిరిగి వచ్చాను. జ్యోతి ఒక పేజీలో లవ్ యు ఖుష్ ముష్ అని రాసి ఉంది. ఆమె ఎవరి కోసం రాసిందనే విషయం ఇంకా తెలియదు. అలాగే సవితను పండ్లు తీసుకురమ్మని చెప్పు అని కూడా రాసి ఉంది.
ఈ సరిహద్దులు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. కానీ హృదయాల మనో వేదనలు మాయమవుతాయి. మనమందరం ఒకే భూమికి, ఒకే నేలకి చెందినవారమని తన డైరీలో జ్యోతి రాసుకుంది. పాకిస్తాన్ ఆతిథ్యం బాగుందని జ్యోతి తన డైరీలో ప్రశంసించింది. అలాగే అక్కడ దేవాలయాలు, గురు ద్వారాలు వంటి మతపరమైన ప్రదేశాలు బాగున్నాయి. వీటిని అందరూ కూడా ఈజీగా చేరుకోవచ్చని తెలిపింది. దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలతో మళ్లీ తిరిగి కలవాలనే కోరిక ఉందని కూడా ఆమె డైరీలో ప్రస్తావించిందని పోలీసులు తెలిపారు..