ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్ధం !
News Image

విజయవాడ సిటీ: రాష్ట్రంలో  ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా  నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఆయా నియోజకవర్గాల్లోను, జిల్లాల్లోనూ అధికారుల పనితీరుపై నిఘా వర్గాల ద్వారా పూర్తి సమాచారం సేకరించిన ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోనుంది. అన్ని కోణాలలో అధికారుల వ్యవహారశైలీలపై పూర్తి సమాచారం సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్స్, కేసులు నమోదు, అరెస్ట్ లు జరిగి పోయాయి. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు హైదరాబాదులో రహస్య సమావేశమయ్యారనే దానిపై కూడా ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరించింది. కానీ ప్రభుత్వ అధినేత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో సమర్ధులకు స్ధానం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు పలు వడపోతల అనంతరం ఒక ప్రాథమిక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 12 నుంచి 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 6గురు డిఐజిలకు కూడా బదిలీ జాబితాలో ఉన్నారు. నలుగురు ఐజిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే సమాచారం. గుంటూరు, ఏలూరు రేంజ్ లకు కొత్త పోలీస్ బాస్ లు రానున్నారని తెలుస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం కమీషనర్ మార్పు కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ బదిలీల ప్రక్రియలో ఒక రిటైర్డ్ డిజిపి చక్రం తిప్పుతున్నారు. దీంతో మంచి పోస్టింగులు ఎవరికి దక్కుతాయి, లూప్ లైన్ లోకి వెళ్లేది ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే వ్యవస్ధను గాడిలో పెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ బదిలీలు ఉంటాయని సమర్ధులైన అధికారులకు తమ ప్రభుత్వంలో స్ధానం ఉంటుందనే మెస్సేజ్ ఇవ్వటానికి ప్రభుత్వాధినేత ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి.