న్యూ ఢిల్లీ : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిహద్దు జిల్లాలపై దాయాది వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి సైరన్ల (Air Sirens) మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసింది.
అటు జమ్మూలోనూ నేటి ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు.
సరిహద్దు జిల్లాల్లో పాక్ నుంచి వస్తోన్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్ఎఫ్ క్యాంప్ను లక్ష్య్ంగా చేసుకొని డ్రోన్ను పంపగా.. భద్రతా బలగాలు కూల్చేశాయి.