( న్యూస్ వన్ ప్రత్యేక ప్రతినిధి )
ఏపీలో ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఇటువంటి జర్నలిస్టులు అరెస్టు జరిగినప్పుడు, వారిపై కేసులు నమోదైనప్పుడు జర్నలిస్ట్ సంఘాలు ఏకతాటి పైకి వచ్చి ఆందోళనలు జరిపేవి. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో ఎలా ముందుకెళ్లాలో జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులకు తెలియడం లేదు. ఆయనపై వచ్చిన అభియోగాలు రాజకీయపరమైనవి. ఆయన పని చేస్తున్న సంస్థ ఓ రాజకీయ పార్టీకి చెందినది. అమరావతి రాజధాని మహిళలపై వచ్చిన కామెంట్స్ కూడా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. అలాగని కొమ్మినేని శ్రీనివాసరావు సాధారణ వ్యక్తి కాదు. జర్నలిస్టుల్లో అత్యంత సీనియర్. అటువంటి వ్యక్తి అరెస్టు జరిగితే నోరు మెదపనిస్థితిలో జర్నలిస్ట్ సంఘాలు ఉండిపోవడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే ఇప్పుడున్న రాజకీయ కారణాలతోనే వారంతా మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది.
* రాజకీయ వ్యతిరేక ముద్ర :
కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్టుకు సుదీర్ఘ నేపథ్యం ఉంది. దశాబ్దాల అనుభవం ఉంది. కానీ ఆయన టిడిపి తో పాటు చంద్రబాబు వ్యతిరేక ముద్ర పొందారు. ఆయన విశ్లేషకుడుగా వ్యవహరించిన కార్యక్రమాలు చూస్తే స్పష్టమైన పక్షపాతం కనిపిస్తుంది. టిడిపి తో పాటు చంద్రబాబును తక్కువ చేసి మాట్లాడడం ఎక్కువగా ఆయన విశ్లేషణలో వెలుగు చూస్తుంది. అయితే నేరం చేయడమే కాదు ఆ నేరాన్ని ప్రేరేపించడం, సమర్థించడం కూడా నేరమే. ఇప్పుడు కొమ్మినేని విషయంలో జరిగింది అదే. అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చారు జర్నలిస్ట్ కృష్ణంరాజు. దానిని ఖండించినట్లు కాకుండా సమర్థించినట్లు కొమ్మినేని వ్యవహార శైలి ఉంది. ఇప్పుడదే ఆయనను ఒంటరి చేసింది.
* పట్టించుకోని జర్నలిస్టు సంఘాలు :
సాధారణంగా ఓ జర్నలిస్టుకు అన్యాయం జరిగితే మిగతావారు నిరసనలు తెలుపుతారు. కానీ కొమ్మినేని విషయంలో మాత్రం అలా ఊహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణిస్తున్న వారు ఉన్నారు. సాక్షి అనేది ఓ రాజకీయ పార్టీకి చెందిన అధికారిక మీడియా. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మతో ప్రచురిస్తున్న రాజకీయ పార్టీకి చెందిన అధికారిక మీడియా. అందులో పని చేస్తున్న కొమ్మినేని లాంటి వ్యక్తులు ఆ సంస్థ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. పైగా టిడిపి తో పాటు చంద్రబాబుపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. పైగా ఇదే అమరావతిపై గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. అవమానకర రీతిలో మాట్లాడారు. తాజాగా తాను యాంకర్ గా ఉన్న డిబేట్లో పాల్గొన్నారు జర్నలిస్టు కృష్ణంరాజు. ఆయన అమరావతిలో వేశ్యలు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు. దానిని అడ్డుకోవాల్సిన కొమ్మినేని సమర్ధించినట్లు మాట్లాడారు. అందుకే ఇప్పుడు అందరూ ఆయనను తప్పుపడుతున్నారు. ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి, ఆపై సీనియర్ జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించేసరికి అందరిలోనూ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. మళ్లీ అది రాజకీయ అంశాల వైపు మళ్ళింది. చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారు. కచ్చితంగా అమరావతి క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుంది. అది కొమ్మినేని కి ఇష్టం లేదు. ఆది నుంచి అమరావతికి వ్యతిరేకిస్తున్నారు కొమ్మినేని. తాజాగా అక్కడి మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారన్న కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అందుకే కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ కు గురైన ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం కావడం లేదు. తోటి జర్నలిస్టులు సైతం దీనిని ఖండించలేని స్థితిలోకి వచ్చారు.
* అపారమైన అనుభవం:
కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కెరీర్ ఆషామాషీ విషయం కాదు. ఈనాడు సంస్థల్లో కెరీర్ ప్రారంభించిన కొమ్మినేని.. చాలా మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. ఒక విధంగా చెప్పాలంటే టీవీ డిబేట్లో రూపకర్త కూడా ఆయనే. కానీ ఎందుకో ఆయన రాజకీయ నేతలకు విభేదించడం ప్రారంభించారు. ముఖ్యంగా చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా విపరీతమైన ద్వేషం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం కొమ్మినేని ఈ పరిస్థితికి కారణం మాత్రం ముమ్మాటికీ ఆయనే. ఒక్క జర్నలిస్టు ఎలా ఉండకూడదు.. ఎలా వ్యవహరించకూడదు.. అన్నది ఇప్పుడు కొమ్మినేనిని, ఆయన పరిస్థితిని చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి. ఆయనపై నమోదైన కేసులు ఎస్సీ, అట్రాసిటీ, ఆపై కఠినమైనవే. అందుకే టీవీ డిబేట్లో నిర్వహించేవారు తమ ఛానల్ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. కానీ డిబేట్లకు హాజరయ్యే వారిని మాత్రం నియంత్రించే స్థాయిలో ఉండాలి. లేకుంటే మాత్రం కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి భవిష్యత్తులో చాలామంది జర్నలిస్టులకు ఎదురయ్యే అవకాశం ఉంది.