( న్యూస్ వన్ ప్రత్యేక ప్రతినిధి )
విశాఖ వేదికగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పెద్ద ఎత్తున సాగబోతోంది. విశాఖ లోని ఆర్కే బీచ్ నుంచి భీమిలీ తీరం దాకా మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్ల మేర యోగాభ్యాసకులతో నిండిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.వీరంతా కలిపి అయిదు లక్షలకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది 2023లో గుజరాత్ లోని సూరత్ లో జరిగిన అతి పెద్ద యోగా ఈ రోజుకీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో ఉంది. ఆనాటి యోగాకు హాజరైన వారి సంఖ్య లక్షన్నర మంది. ఆ రికార్డు బద్ధలు కొట్టాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం చూస్తోంది.
సూరత్ జనాలకు మూడు రెట్లు దాదాపు 5 లక్షల దాకా యోగాభ్యాసకులతో 21న మోడీ సమక్షంలో అంతర్జాతీయ యోగా డేని నిర్వహించాలని చూస్తోంది. అదే జరిగితే విశాఖ గిన్నీస్ బుక్ రికార్డుని సాధిస్తుంది. ఈ రికార్డు బద్ధలు కొట్టడానికి చాలా కాలమే పట్టవచ్చు.అన్ని ఏర్పాట్లు బాగున్నాయి కానీ వరుణుడే భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కాస్తా అల్ప పీడనంగా మారుతోంది. రానున్న రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి రుతు పవనాలు ఈసారి తొందరగా వచ్చేశాయి. దాంతో వానలు బాగా కురుస్తున్నాయి. తీర ప్రాంతమైన విశాఖలో అల్పపీడనాలు మామూలు వ్యవహారంగా ఉంది. యోగా డే నాడు వరుణుడు కాస్తా కరుణిస్తే చాలు సవ్యంగా ప్రధాని మోడీ కార్యక్రమం పూర్తి అవుతుందని అంతా దండాలు పెట్టుకుంటున్నారు
ఇదిలా ఉంటే మోడీ విశాఖలో ఆర్కే బీచ్ వద్ద ఉన్న కాళీ మాత ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యోగాసనాలు వేస్తారు. ఆయనతో పాటుగా ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మంత్రులు సహా పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు యోగా వేసేందుకు అంతా సిద్ధం చేసారు. అంతా బాగుంది కానీ అందరి చూపు ఆకాశం మీదనే ఉంది. వరుణుడు దయ చూపిస్తే విశాఖ యోగా డే గ్రాండ్ సక్సెస్ కావడమే కాదు గిన్నీస్ రికార్డుని బద్ధలు కొడుతుంది. అలా యోగా డే గ్రాండ్ సక్సెస్ కావాలని అంతా కోరుకుంటున్నారు.