మధ్యప్రదేశ్ : పహల్గాం దాడికి వ్యతిరేకంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో దీటుగా బదులిస్తోంది. ఇప్పటికే పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్కు చెందిన సుమారు 7.5 లక్షల ట్రక్కుల (వాహనాలు)ను సైన్యానికి అందిస్తామని ఆ రాష్ట్ర ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపింది.ఈ మేరకు ఇందౌర్లో ఏఐటీఎంసీ రాష్ట్ర చీఫ్ సీఎల్ ముకాఠి మీడియాతో మాట్లాడారు. ‘భారత సైన్యానికి మధ్యప్రదేశ్లో రిజిస్టర్ అయిన దాదాపు 7.5 లక్షల ట్రక్కులను అందిస్తామని ప్రధాని కార్యాలయానికి లేఖ రాశాను. ‘ఆపరేషన్ సిందూర్’తో దేశం మొత్తం గర్వపడాలి. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల వేళ రిజిస్టర్ చేసిన ట్రక్కులను(వాహనాలు) ఉచితంగా సైన్యానికి అందించేందుకు సిద్ధం చేసి ఉంచాం. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షితంగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలోనూ సుమారుగా వెయ్యి ట్రక్కులను మోవ్లోని ఆర్మీ కంటోన్మెంట్కు అప్పగించామని ఈ సందర్భంగా ముకాఠి తెలిపారు.