హైదరాబాద్ :హైదరాబాద్లో బాంబు పేలుళ్ల కోసం సౌదీ అరేబియాలోని ఐఎస్ ఉగ్రవాదుల సాయంతో తెలుగు రాష్ట్రాల యువకులు సయ్యద్ సమీర్, సిరాజ్ ఉర్ రెహ్మాన్ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని వారాసిగూడకు చెందిన సయ్యద్ సమీర్, ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను పోలీసులు విచారించి కీలక వివరాలు రాబట్టారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో నిందితులు పేలుళ్లకు కుట్ర పన్నారు. ఆరుగురు సభ్యులతో సమీర్ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాడు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.సిరాజ్ తండ్రి విజయనగరంలోని రూరల్ స్టేషన్లో ఏఎస్సై, అతడి తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. 2017లో సిరాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎస్సై సెలక్షన్స్ కోసం హైదరాబాద్కు శిక్షణ కోసం వచ్చాడు.రెండుసార్లు ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. గ్రూప్-1 కోసం శిక్షణ తీసుకుని రెండుసార్లు ప్రయత్నం చేసినా సెలెక్ట్ కాలేదు. 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 108లో టెలికాలర్గా పనిచేశాడు. హైదరాబాద్లో ఉండగా సయ్యద్ సమీర్తో అతడికి పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్కు చెందిన పరహాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బాదర్ తో పరిచయాలు ఏర్పడ్డాయి.ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చించుకునేవారు. గత ఏడాది నవంబర్ 22న ముంబైకి వెళ్లి ఓ పదిమందిని కలిశారు సమీర్, సిరాజ్. అద్నాన్ ఖురేషి, దిల్షాన్, మొహిషిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్ కలిసి ఓ లైవ్ షోకి హాజరయ్యారు. షహబాజ్, జీషన్ అనే వ్యక్తులతో పాటు తదితరులను కలిసేందుకు జనవరి 26న సమీర్ ఢిల్లీ వెళ్లాడు.షహబాజ్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసి మరుసటి రోజు సల్మాన్, సిరాజ్ మండూలికి వెళ్లారు. సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ సూచనల మేరకు సిగ్నల్ యాప్ లో తరచూ చర్చలు జరిపారు. రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి పేలుడు పదార్థాల ముడిసరులను తెప్పించాడు సిరాజ్.జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయం తీసుకున్నారు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ ద్వారా కొనుగోలు చేసిన పేలుడు పదార్థాలతో ఐఈడీ తయారు చేసి, జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశంలో పేల్చాలని వారికి ఆదేశాలు వచ్చాయి. బాంబులు తయారైన తర్వాత మొదట డమ్మీ బ్లాస్ట్ చేయాలని ఆదేశాలు అందాయి. ఐఈడీలను పేల్చి వీలైనంత ఎక్కువ మందిని చంపాలని వారిని ఇమ్రాన్ ఆదేశించాడు.
Print News