ఇరాన్ : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుండటంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఇక ఈ పోరు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపిస్తే మాత్రం ప్రపంచ ఇంధనానికి జీవనాడి లాంటి ఓ జలసంధి మూతపడే ప్రమాదం ఉంది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. అదే హర్మూజ్ జలసంధి.అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదే అని చెబుతున్నాయి. దీనిలో రెండు షిప్పింగ్ లేన్లు ఉన్నాయి.ఇందులో వెరీలార్జ్ క్రూడ్ క్యారియర్లు సులువుగా ప్రయాణించగలుగుతాయి. దీనిలో ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశిస్తాయి. చమురును నింపుకొని ఇరాన్ సమీపం నుంచి హర్మూజ్ను దాటి బయటకు వస్తాయి.
ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. దీనిలో అత్యధికం ఖతార్ ఎగుమతి చేస్తుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. దీన్ని గుర్తించిన అమెరికా బహ్రెయిన్లో తన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొంది. ఇక ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
భారత్ అవసరాలకు వాడే చమురులో 40 శాతం ఈ మార్గం నుంచే రవాణా అవుతోంది. ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్ నుంచి మనం దిగుమతి చేసుకొంటున్నాం. మన దేశం వినియోగించే ఇంధనంలో 90 శాతం వివిధ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి మూసుకుపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతోపాటు.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ ధరలకు రెక్కలు రావడం ఖాయం. దీంతో భారత ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 13న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడుతూ దేశీయ అవసరాలకు సరిపడా చమురు సరఫరా అవుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వివిధ దేశాలతో మనకు ఉన్న చమురు ఒప్పందాలకు తోడు.. మనకు ఉన్న వ్యూహాత్మక నిల్వలు 74 రోజులకు సరిపోతాయి. ఇరాన్ ఎన్నడూ ఈ జలసంధిని మూయలేదు. వాస్తవానికి టెహ్రాన్ ఉత్పత్తి చేసే చమురులో 80శాతం చైనా కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ను మూస్తే.. దాని ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది. 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలపై నాడు సౌదీ అరేబియా, దాని మద్దతుదారులు చమురు వ్యాపారం నిలిపేశారు. కాకపోతే ఇప్పుడు అలాంటి నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కొంతకాలం కిందట వరకు అమెరికా అత్యధికంగా ఇంధనం దిగుమతి చేసుకొనేది.. ఇప్పుడు అది కూడా భారీ ఎత్తున చమురును ఎగుమతి చేస్తోంది. 1980-88 వరకు జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం ప్రభావం జలసంధిపై పడింది. నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు.. ట్యాంకర్లపై దాడులు చేసుకొన్నాయి. దీనిని ట్యాంకర్ వార్ అని కూడా అంటారు. ఆ సమయంలో వివిధ దేశాల పతాకాలపై ప్రయాణించిన దాదాపు 450కు పైగా నౌకలపై ఇరు దేశాలు దాడులు చేశాయి.
1988లో అమెరికా యుద్ధ నౌక పొరబాటున ఓ ఇరాన్ పౌర విమానాన్ని కూల్చేసింది. దీంతో 290 మంది మరణించారు. ఉద్దేశపూర్వకంగానే కూల్చారని టెహ్రాన్ ఆరోపించగా.. పొరబాటున జరిగిందని వాషింగ్టన్ వివరణ ఇచ్చింది. అమెరికా, ఐరోపా ఆంక్షలకు ప్రతిగా హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది.